సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్: జర్నలిస్టులకు పాత జీ.ఓ ప్రకారమే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జీ.ఓ 252, జీ.ఓ 103లో కేబుల్ ఛానల్స్ కు అక్రెడిటేషన్స్ జారీ విషయంలో అన్యాయం జరిగిన విషయాన్ని మంత్రికి వివరించారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టుకు అక్రెడిటేషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందివద్దని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, తెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, సిటీ కేబుల్ ఎం.డి శివరామ కృష్ణ, ఎం.ఎస్ ఓ సంఘం నాయకులు వంగా శ్రీనివాస్ రెడ్డి, కేబుల్ చానెల్స్ జేఏసీ నాయకులు కడకంచి వెంకటేష్, హెచ్ వి.చలపతి, దేవేందర్, అరవింద్, బ్రహ్మం, రాజేష్ తదితరులు ఉన్నారు.