సాక్షి డిజిటల్ న్యూస్, 03/ఫిబ్రవరి షాద్నగర్:రిపోర్టర్/కృష్ణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీ-ఫారాలు పొందిన నాయకుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుండగా, అవకాశం దక్కని పలువురు ఆశావహులు నిరాశలో కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కొందరు నాయకులు ఆనందోత్సాహాలతో ప్రచారంలో బిజీగా ఉండగా, మరికొందరు కుంగిపోయి బాధపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, ఆశావహులను ఈ సమయంలో పక్కన పెట్టకుండా పార్టీ నాయకత్వం గుర్తించి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో అందరి సహకారం అవసరమైన వేళ, నిరాశలో ఉన్న నేతలను పట్టించుకోకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బీ-ఫారం రాకపోవడం ఓటమి కాదని, భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని నాయకులు స్పష్టంగా చెప్పి, కష్టపడిన కార్యకర్తలను సమన్వయం చేయాల్సిన బాధ్యత పార్టీ పెద్దలపై ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏర్పడిన ఆవేదనను సమయానికి తగ్గించకపోతే ఎన్నికల వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎన్నికల్లో గెలుపు సాధించాలంటే విజయం పొందినవారితో పాటు నిరాశలో ఉన్నవారిని కూడా కలుపుకుని ముందుకు సాగాల్సిందేనని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి.