సాక్షి డిజిటల్ న్యూస్ : మార్చి 21, (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
రంజాన్ పర్వదినం సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు” శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం అంతా నియమనిష్ఠలతో, కఠోరమైన ఉపవాసాలతో, దైవ ప్రార్థనలతో గడపి, పేద వారికి సాయం చేస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. త్యాగం, సేవానిరతి, పవిత్రతలకు ప్రతీకైన రంజాన్ పర్వదినం ఘనంగా జరుపుకోవాలని సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. దైవ చింతన, భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ముస్లిం సోదరులు తమ ఇష్టదైవాన్ని కొలవడం ఆదర్శప్రాయమన్నారు. అల్లాహ్ కృపా కటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలన్నారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదులకు రానున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులు నిర్వహించాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.