సాక్షి డిజిటల్ న్యూస్ : మార్చి 21 (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష). ఎబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే పూర్ణ ఆనారోగ్యంతో అందరికీ దూరమవ్వడం తనను కలిచివేస్తోందని సిఎం చంద్రబాబు అన్నారు. ఎబిఎన్ పూర్ణ పేరుతో అందరికీ సుపరిచితుడిగా, అందరికీ ఆత్మీయుడిగా ఉండే పూర్ణ మృతి విచారకమన్నారు. ఆనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన పూర్ణ కోలుకుంటారని తాను భావించానని, కానీ నేడు దూరమవ్వడం బాధాకరమన్నారు. ఎబిఎన్ ఛానల్ తరపున తెలుగుదేశం పార్టీ వార్తల కవరేజ్ విధులు నిర్వహించే పూర్ణ తనతో సన్నిహితంగా ఉండేవారని సిఎం గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఎప్పుడు కలిసినా ప్రజల సమస్యలు గురించి పూర్ణ నిర్మొహ మాటంగా చెప్పేవారని సిఎం అన్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే మనస్తత్వం ఉన్న ఆయన…. అందరితో కలివిడిగా ఉంటూ, ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నారన్నారు. 54 ఏళ్ల వయసులోనే పూర్ణ అందరికీ దూరమవ్వడం తీవ్ర విషాదకరమని సిఎం చంద్రబాబు అన్నారు. పూర్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి…..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.