5 సంవత్సరాలుగా అసంపూర్తిగా అంగన్వాడి భవనం – గిరిజన పిల్లలతో ప్రభుత్వం ఆటలాడుతోందా?

*గిరిజనులు అంటే ప్రభుత్వానికి అంత చిన్నచూపా? వెంటనే నిర్మాణం పూర్తి చేయాలి *కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ చట్టారి సాయిబాబా

సాక్షి డిజిటల్ న్యూస్. 15.మార్చి..అల్లూరి జిల్లా.. డుంబ్రిగుడ మండలం (పీతల. విలియంకేరి. రిపోర్టర్):అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం అరుకు పంచాయతీ కొండవీది గ్రామంలో సుమారు ఐదు సంవత్సరాలుగా అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడి భవనాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ చట్టారి సాయిబాబాశనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల అభివృద్ధి, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరియు పోషకాహారం కోసం అత్యంత కీలకమైన అంగన్వాడి కేంద్రం ఇలా సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉండటం చాలా దురదృష్టకరమని అన్నారు. కొండవీది గ్రామంలో సుమారు వందమంది చిన్నారులు మరియు గర్భిణీ స్త్రీలు అంగన్వాడి సేవలపై ఆధారపడుతున్నప్పటికీ సరైన భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన అంగన్వాడి భవనం ఇప్పటివరకు పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ నిర్లిప్తతకు నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం అంగన్వాడి కార్యకలాపాలు తాత్కాలిక షెడ్లు లేదా అసౌకర్యమైన ప్రదేశాల్లో నిర్వహించాల్సి వస్తుండటంతో చిన్నారులు ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అన్న తేడా లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషకాహారంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉండగా, ఒక చిన్న అంగన్వాడి భవనం కూడా ఐదు సంవత్సరాలుగా పూర్తి చేయలేకపోవడం చాలా బాధాకమని అన్నారు. గిరిజన పిల్లలు, గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం నిర్మించాల్సిన అంగన్వాడి భవనాన్ని ఇంతకాలం నిర్లక్ష్యం చేయడం గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ఐసిడిఎస్ అధికారులు, మండల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కొండవీది గ్రామంలోని అంగన్వాడి భవన నిర్మాణాన్ని అత్యవసరంగా పూర్తి చేయాలని గ్రామస్తుల తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి బలంగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ సమస్యను మీడియా మరియు ప్రజా వేదికల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, సాలపు జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *