సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 15 వరంగల్ రిపోర్టర్ జన్ను కొర్నేలు తెలంగాణలో ధాన్యం (ప్యాడి), పత్తి రవాణాకు అవసరమైన “ రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్యకు లేఖ ద్వారా “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. లోక్సభలో రూల్ 377 కింద 2025 డిసెంబర్ 9న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రస్తావించిన అంశానికి స్పందిస్తూ మార్చి 6న మంత్రి లేఖ రాశారు. తెలంగాణలో ధాన్యం, పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అదనపు “ రైల్వే రేక్స్” అందించాలని ఎంపీ డా. కడియం కావ్య కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ఆహార సంస్థ సమర్పించే అవసరాల ఆధారంగా ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రేకులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ అవసరాలు, రైల్వే బోగీల లభ్యత, రైల్వే మార్గాల సామర్థ్యం, నిర్వహణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరుగుతాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2026 జనవరి వరకు తెలంగాణలో భారత ఆహార సంస్థ ద్వారా సుమారు 3.59 మిలియన్ టన్నుల ధాన్యం (సుమారు 1,329 రైల్వే రేకులు) లోడింగ్ జరిగినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం సహా ఆహార ధాన్యాల రవాణా నిరంతరంగా సాగేందుకు రోజువారీగా “ రైల్వే రేక్స్” అందిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు భారతీయ రైల్వేలు కట్టుబడి ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. రైతుల పంటల రవాణా సులభతరం కావడానికి ఈ చర్యలు ఎంతగానో ఉపయోగ పడతాయని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు.