పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 14 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించే ఉద్దేశంతో స్థానిక పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌతు శిరీష స్వయంగా హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా విద్యుత్ దీపాలు, ఇళ్ల స్థలాలు, మురుగు కాలువలు, రహదారుల నిర్మాణం, పెన్షన్లు, ఇండ్ల నిర్మాణం మరియు తెల్ల రేషన్ కార్డుల మంజూరు వంటి పలు కీలక అంశాలపై ప్రజలు తమ వినతులను సమర్పించారు. మొత్తంగా 27 అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే, వాటిలో కొన్నింటిని తక్షణమే పరిష్కరించారు. సంబంధిత అధికారులతో నేరుగా చరవాణిలో (ఫోన్లో) మాట్లాడి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన సమస్యలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యం అని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.