సాక్షి డిజిటల్ న్యూస్ : మార్చి 14 (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (శంషాబాద్ ఎయిర్పోర్టు) అభివృద్ధిపై పెద్ద ప్రణాళిక రూపొందించారు. సుమారు 5000 ఎకరాల భూమిని వినియోగించి, దాన్ని దుబాయ్ తరహాలో భారీ అంతర్జాతీయ విమాన కేంద్రంగా మార్చాలని ఆయన ఆలోచించారు. ఈ ప్రణాళికలో భాగంగా అక్కడే విమానాల ఫ్లైట్ మెయింటెనెన్స్, రిపేర్ మరియు ఓవర్హాల్ సెంటర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఈ సెంటర్ ఏర్పడితే ప్రపంచంలోని అనేక విమానాలు శంషాబాద్కు వచ్చి సర్వీసింగ్ చేయించుకునే అవకాశముండేదని అప్పట్లో నిపుణులు భావించారు. అయితే 2004లో ప్రభుత్వం మారడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగలే కపోయారు. దీంతో ఆ ఫ్లైట్ మెయింటెనెన్స్ సెంటర్ ప్రాజెక్టు అమలు కాలేదు. అది అమలై ఉంటే శంషాబాద్కు ప్రస్తుతం ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువ అంతర్జాతీయ విమానాలు వచ్చేవని చెబుతున్నారు. సింగపూర్, మలేషియా, కొలంబో, ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి మరింత విమాన రాకపోకలు పెరిగి, అది ఒక పెద్ద అంతర్జాతీయ హబ్గా మారే అవకాశం ఉండేది. ఈ ఆలోచనను తరువాత కూడా కొనసాగించిన చంద్రబాబు, కొత్త రాజధాని అమరావతిలో సుమారు 7000 ఎకరాల భూమితో ఒక ఫ్లైట్ హబ్ మరియు మెయింటెనెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. శంషాబాద్లో సాధ్యం కాకపోయినా, కనీసం అమరావతిలో అయినా ఈ ప్రాజెక్టును అమలు చేయాలనే తపన ఆయనకు ఉందని అంటున్నారు. అలాగే విశాఖపట్నం సమీపంలోని భోగాపురం ప్రాంతంలో కూడా ఇలాంటి విమాన సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం ప్రణాళికలు రూపొందించారు. అయితే 2019 తరువాత రాజకీయ పరిస్థితులు మారడంతో ఆ ప్రణాళికలు ముందుకు సాగలేకపోయాయి. ఇటీవల హీరో శివాజీ కూడా అమరావతిలో పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అది మరో దుబాయ్లా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం ఇదే నేపథ్యంలోనని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం పూర్తి స్థాయి భారీ విమాన మెయింటె నెన్స్ హబ్లు చాలా తక్కువగా ఉండటం, ఎక్కువ విమానాలు విదేశాలకు వెళ్లి సర్వీసింగ్ చేయించుకోవాల్సి రావడం వల్లే చంద్రబాబు ఈ ఆలోచనను ముందుకు తెచ్చారని చెప్పబడుతోంది.