ఎఐఎంఎస్‌ఆర్‌లో విద్యార్థులు–తల్లిదండ్రుల సమావేశం

సాక్షి డిజిటల్‌ న్యూస్‌, ఫిబ్రవరి 14, చిత్తూరు టౌన్‌(రిపోర్టర్‌ – జయచంద్ర): చిత్తూరులోని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎఐఎంఎస్‌ఆర్)లో శుక్రవారం ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశాన్ని అసోసియేట్ డీన్ డాక్టర్ రమ్యా రామకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు సాంకేతికంగా ఇంకా చిన్న వయస్సులోనే అత్యంత క్లిష్టమైన వైద్య విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారికి మెరుగైన నైపుణ్యాలు సాధించేందుకు ఏఐఎంఎస్‌ఆర్‌లో అనుభవం, సేవాభావం కలిగిన ఫ్యాకల్టీ సభ్యులు సమర్థంగా మార్గనిర్దేశనం చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల బాధ్యత ఎప్పటికీ ముగియదని, ఉపాధ్యాయులు విద్యార్థులకు రెండవ తల్లిదండ్రులుగా ఉంటారని చెప్పారు. ఫస్ట్ ఇయర్ చదువు కఠినమైన, గట్టి పాఠ్యాంశాలతో కూడినదని, విద్యార్థులకు బలమైన పునాదులు వేయడంలో ఎఐఎంఎస్‌ఆర్‌ ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలిపారు. విద్యార్థుల అకడమిక్ ప్రగతి, క్లినికల్ ట్రైనింగ్, రాబోయే విద్యా అవకాశాలు, పరిశోధనలో పాల్గొనే అవకాశాలు వంటి అంశాలపై తల్లిదండ్రులతో సమాలోచన చేయడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని వివరించారు. మెంటర్–మెంటీ వ్యవస్థ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత, విద్యా సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తోందని, ఇటువంటి సమావేశాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ (రిసెర్చ్) డాక్టర్ ఉషా అడిగ, ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ రమ్యా, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ తెరిస రాణి, డాక్టర్ శ్రవణ దీప్తి తదితర ఫ్యాకల్టీ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానమిస్తూ విద్యార్థుల భవిష్యత్ కెరీర్ ప్రణాళికలపై మార్గనిర్దేశనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *