శ్రీశైలం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పరిశీలన

సాక్షి డిజిటల్ న్యూస్:,నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, దేశం నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్,  అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీశైలం క్షేత్రంలో ముఖ్యమైన ప్రాంతాలైన పాతాళగంగ,రోప్‌వే,పార్కింగ్ ప్రదేశాలు,కోనేరు,స్నాన ఘట్టాలు,ఆలయ పరిసర ప్రాంతాలు తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.భక్తుల రాకపోకలు సజావుగా సాగేలా తీసుకోవాల్సిన చర్యలు,భద్రతా ఏర్పాట్లు,ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల అందుబాటు వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా భక్తుల భద్రతే ప్రథమ లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ప్రతి చిన్న అంశంపై కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ మరియు ఎస్పీ పేర్కొన్నారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా,సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించే దిశగా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు.