గిరిజన–గ్రామీణ ప్రాంతాల్లో క్షయ నిర్మూలనకు ఆశాలే కీలకం: డాక్టర్ రఫిక్

★ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలలో 100% ప్రగతి సాధించాలి

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ బిజినపల్లి: మండల పరిధిలో
గిరిజన, గ్రామీణ ప్రజలకు క్షయ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించి వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలిం చేందుకు ఆశా కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని జిల్లా క్షయ వ్యాధి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రఫిక్ అన్నారు. బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశ కార్యకర్తల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు క్షయ వ్యాధిపై ప్రత్యేకంగా అవగాహన పెంచాలని, అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తులకు తప్పనిసరిగా తుమ్ము పరీక్షలు, ఎక్స్‌రేలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అనంతరం వెంటనే మందులు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల్లో వంద శాతం లక్ష్యసాధన సాధించే దిశగా ఆశా కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆసంక్రమిత వ్యాధుల గుర్తింపు, గర్భవతుల నమోదు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాల్లో 100 శాతం ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తేజస్విని, ఆరోగ్య సిబ్బంది మెహనాజ్, సుంకోజు శ్రీనివాసులు, శశికళ, నాగేష్, బొజ్జమ్మ, సుమిత్ర, చంద్రశేఖర్, వరలక్ష్మి, జకియా, విజయలక్ష్మి, హెలెన్, జ్యోతి తదితరులు, అన్ని గ్రామాల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.