ఖానాపూర్ లో వైభవంగా గోపూజ: పకృతి వ్యవసాయంతోనే అన్నదాతకు సుస్థిర లాభాలు

★కిసాన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్ల చంద్రయ్య

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ బిజినాపల్లి, మండలం ఖానాపూర్ గ్రామంలో రైతులు ఎప్పుడూ సంఘటితంగా ఉండినప్పుడే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని భారతీయ కిసాన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్ల చంద్రయ్య స్పష్టం చేశారు. భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో బిజినాపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో మంగళవారం కిసాన్ సంఘ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా, అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గండ్ల చంద్రయ్య రైతులు సంప్రదాయ పంటలతో పాటు చిరుధాన్యాల సాగుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పంట మార్పిడితో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడి పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుందని తెలిపారు. గో ఆధారిత వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ ప్రకృతి అనుకూల సాగు వైపు రైతులు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుద్దేటి ఆంజనేయులు, ఖానాపూర్ గ్రామ సర్పంచ్ ఇందిర, మండలాధ్యక్షులు మంతటి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.