సాక్షి డిజిటల్ న్యూస్ – ఫిబ్రవరి 3 – సికింద్రాబాద్ – నిరుపేదలకు వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తామని, విద్య, వైద్య రంగాలను పేదలకు చేరువలో నిలుపుతామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన నామాలగుండు ప్రాంతంలోని రాచమల్ల నవీన్ తీవ్ర అస్వస్థతకు గురై, సితఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయాన్ని సహాయానికై ఆశ్రయించారు. వెంటనే స్పందించిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్ ఆయనకు రూ.రెండు లక్షల విలువజేసు వైద్య సేవలను పొందేందుకు వీలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్.ఓ.సి. పత్రాన్ని సమకూర్చి సోమవారం తన కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలను అందించడంలో తాము అగ్ర స్థానంలో నిలుస్తామని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజల సమస్యల పరిష్కారానికి సితఫలమండీ లోని తమ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.