సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి.29: వేములవాడ. ఆర్. సి. ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… స్వేచ్ఛగా.. ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, క్యూలైన్ నిర్వహణ, తదితర అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ప్రతి నామినేషన్ కేంద్రంలో గడియారం ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు, ప్రజలకు త్రాగునీరు, తదితర సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ జరపాలని అధికారులకు ఆదేశించారు. నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ. ఈ నెల 28వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి 05.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల వరకు రెండు వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. వేములవాడలో 28 వార్డులకు సంబంధించి.. 10 మంది ఆర్ఓలు, 10 మంది ఏఆర్ఓలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నియమించామని తెలిపారు. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీం లను నియమించామని విచారించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నూతన బ్యాంకు ఖాతా, అఫిడవిట్, బలపరిచే వారి వివరాలు, మిగతా పత్రాలు సమర్పించాలని సూచించారు. ప్రతి మున్సిపల్ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. వారి వద్ద పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. జిల్లా యంత్రాగం, మున్సిపల్, పోలీసుల ఆద్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.