
సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 మంచిర్యాల జిల్లా ప్రతినిధి లింగంపల్లి మహేష్. చెన్నూరు మున్సిపాలిటీలో పలు కీలక అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ. కోటి 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు చెన్నూరు పట్టణ రూపురేఖలను మార్చేలా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముందుగా చెన్నూరు పట్టణ ప్రవేశ ద్వారం వద్ద నిర్మించనున్న కమాన్కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం 7వ వార్డు వడ్డేపల్లిలో కల్వర్ట్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. దీంతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న వర్షాకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అదే విధంగా చెన్నూరు మార్కెట్ ప్రాంతంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. మార్కెట్ మౌలిక వసతులు మెరుగుపడితే వ్యాపారులకు, ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి కోసం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.