సాక్షి డిజిటల్ న్యూస్ 8నవంబర్ 2025 (జగిత్యాల్ జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి : యువతే దేశ భవిష్యత్తు చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎదగాలి కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్య క్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి అశోక్ కుమార్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య అనేది కేవలం ఉద్యోగం పొందడానికి మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక శక్తి అని ప్రతి విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, కష్టపడి చదువుకోవడం, ముఖ్యమని అన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవీయ విలువలను అలవరచుకోవాలి, అని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు కాబట్టి, వారు చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేయకుండా, దానిని నేర్చుకోవడానికీ, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికీ వినియోగించు కోవాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, తెలియని లింకులు, ఫేక్ ఐడీలకు స్పందించకూడదని సూచించారు. కళాశాల యాజమాన్యం ఎప్పటికప్పుడు విద్యార్థుల నడవడిక, ప్రవర్తన పట్ల శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించాలని, ర్యాగింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలని, సమాజంలో ఆదర్శవంతులుగా నిలవాలని అన్నారు. అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వాడకం భవిష్యత్తును నాశనం చేస్తుందని ఈలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లాంటి మత్తుపదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీస్ వారికి అందివ్వాలని తెలిపారు. విద్యార్థులు చేడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుని, కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు.