సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 5, చిత్తూరు పట్టణం (రిపోర్టర్ జయచంద్ర): ది ఆపోలో యూనివర్శిటీలో యునిసెఫ్, స్కిల్ రూట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన “ఉచిత కృత్రిమ మేధస్సు – చాట్జిపిటి శిక్షణా కార్యక్రమం” బుధవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణా తరగతులను వైస్ చాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ డా. వినోద్ భట్ మాట్లాడుతూ— “కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇప్పుడు ప్రతి రంగంలో విస్తరిస్తోంది. విద్యార్థులు దీనికి అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఏఐ కేవలం ఇంజనీరింగ్ విభాగానికి మాత్రమే పరిమితం కాకుండా, వైద్య రంగం సహా అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో ప్రతి రంగంలోనూ ఏఐ ప్రాధాన్యం మరింతగా పెరుగుతుంది. ఈ తరహా శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు, గ్లోబల్ స్థాయిలో పోటీకి సిద్ధం కావడంలో కూడా ఎంతో సహాయపడతాయి” అని తెలిపారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ డా. డి. జగదీశన్ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల ప్రత్యక్ష బోధన శిక్షణ కార్యక్రమంలో, వివిధ పరిశ్రమల నుండి వచ్చిన ఆరుగురు నిపుణులు విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఏఐ), జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు కృత్రిమ మేధస్సు యొక్క మూల సూత్రాలు, దాని పారిశ్రామిక వినియోగాలు, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన పొందనున్నారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు యునిసెఫ్ ధృవపత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ రూట్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ భూపతి, ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లు ప్రొఫెసర్ మురళీకృష్ణ, డా. సుదీర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.